దేవాలయాలు నందు పాటించవలసిన నియమాలు.

ఆగమ శాస్త్రములో దేవాలయములో అర్చకులు, భక్తులు, అధికారులు ఏ విధముగా వ్యవహరించకూడదో వివరించబడింది.

  • ఆలయములోనికి తలపాగా ధరించి వెళ్లరాదు.
  • చేతిలో లేదా ఇతర విధంగా ఎటువంటి ఆయుధములు తీసుకుని వెళ్లరాదు.
  • ఆలయము లోపల వాహనము మీదగానీ, పాదరక్షలతో గాని తిరుగరాదు.
  • దేవాలయ ప్రాంగణం లోనికి మత్తు పదార్ధంలు,మాదకద్రవ్యాలు సేవించిగాని,తీసుకుని గాని వెళ్లరాదు.
  • ఆలయ ప్రాంగణములో మల, మూత్ర విసర్జన చేయరాదు.
  • ఆలయమందు కాళ్ళు చాపుకొని కూర్చుండుట, నిద్రపోవుట చేయరాదు.
  • ఏ ప్రాణికైనా దుఃఖం కలిగించే ఎటువంటి హింసనూ చేయరాదు.
  • ఆలయములో ఎన్నడూ ఎవరితో వివాదములు పెట్టుకోరాదు.
  • దేవాలయంలో అహంకారముతో, గర్వముతో, అధికార దర్పముతో ఉండరాదు.
  • ఆలయములో దేవుని ఎదుట పర స్తుతిని, పర నిందను కూడా చేయరాదు.
  • ఆలయములో దేవుని ఎదుట పృష్ఠభాగం చూపిస్తూ కూర్చుండరాదు.
  • ఆలయంలోఅధికార గర్వంతో అకాలంలో ఆలయంలో ప్రవేశించి అకాల సేవలను చేయరాదు/చేయించుకొనరాదు.
  • ఆలయాలలో భగవంతునికి ఒక చేతితో ప్రణామము చేయరాదు.
  • ఆలయాలలో ఇతరులకు నమస్కరించడం చేయరాదు. భగవంతుని ఎదుట అందరూ సమానులే అని భావించవలెను.
  • పూజాది కార్యక్రమాలనందు భుజాల మీదుగా వస్త్రం లేకుండా దైవపూజ చేయరాదు.
  • పురాణ కథలు,ఆధ్యాత్మిక ప్రసంగాలు జరుగుతున్నపుడు ఎటువంటి విఘ్నాలు కలుగ చేయరాదు.
  • ఆలయ ఆవరణలో పెద్దగా అరవటం, నవ్వటం,స్వంతవిషయాలు మాట్లాడటం చేయరాదు.
  • ఆలయంలో నోట్లో వ్రేళ్ళు పెట్టుకొనుట, గోళ్ళు కొరుకుట, పెద్దగా నవ్వుట చేయరాదు.
  • దేవాలయ ప్రాంగణంలో ఉమ్మడం, పొగత్రాగటం రెండూ నిషిద్దాలే.
  • ఆలయంలోనికి నుదుట కుంకం లేదా  తిలకం ధరించకుండా వెళ్లరాదు.
  • ఆలయంలోనికి తాంబూల చర్వణం చేస్తూ లేదా ఆహారాదులు తినుచూ ప్రవేశించరాదు.
  • కొబ్బరికాయ కొట్టాక వెనుకవైపు పీచు తీయాలనే నియమం తప్పనిసరి కాదు. శుభ్రత కోసం పీచు తీయవచ్చు, తీయకపోయినా దోషం ఏమి లేదు.
  • ఆలయ ప్రాంగణంలో అర్చకునిపై కేకలు వేయరాదు. అర్చకునిలో దోషం ఉంటే  ఒంటరిగా బయటకు పిలిచి సున్నితంగా మందలించాలి.
  • దేవాలయంలో  దేవుని ముందు ఆధిక్యతను ప్రదర్శిస్తే దైవనిందతో సమానం.

శ్రీమతే రామానుజాయ నమ:

  • ఆలయంనకు వెళ్ళేటప్పుడు, గురుదర్శనానికి వెళ్ళేటప్పుడు, పురాణం వినటానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరాదు. మనకు తోచిన పండ్లు లేదా పూలు ఏదో ఒకటి తీసుకు వెళ్లి సమర్పించటం మంచి సంప్రదాయం.
  • ఆలయంలోనికి ప్రవేశించే ముందు తప్పని సరిగా తొలుత రెండు కాళ్లు  వెనుక,ముందూ తడిచేలా కడుక్కుని,మూడుసార్లు నోటిని పుక్కింలించి నీటిని బయటికి వదలాలి. తొందరగా తిరిగి వెళ్లాలనే మనసుతో కాకుండా ప్రశాంతంగా, నెమ్మదిగా భగవంతుడ్ని దర్శించాలి.
  • ఆలయమునకు ప్రదిక్షిణ చేసి తరువాత లోనికి ప్రవేశించాలి.ఆలయ ప్రదిక్షిణ వింటి నుంచి వెలువడ్డ బాణంలా వెనుకెవరో తరుముతున్నట్లు ప్రదిక్షిణం చేయరాదు.నిండు గర్భిణి నడిచినట్లు అడుగులో అడుగు వేస్తూ అడగడుగునా దేవుని స్మరిస్తూ ప్రదిక్షిణలు చేయాలి.
  • చాలా మంది ప్రదిక్షిణలు చేస్తున్నప్పడు దేవాలయం వెనుక భాగాన్ని అద్ది నమస్కరిస్తుంటారు.అలా చేయరాదు.ఆభాగంలో రాక్షసులుంటారు.అలాగే ఆలయానికి గజం దూరం నుంచి ప్రదిక్షిణ చేయాలి.
  • విష్ణు ఆలయంలో నాలుగు ప్రదిక్షిణలు చేయాలి.ఆలయంలో ఆత్మప్రదిక్షిణ అనునపుడు తన చుట్టూ తాను తిరగరాదు. నమస్కారం చేస్తే చాలు, ప్రదిక్షిణం ఆలయం చుట్టూ మాత్రమే చేయాలి.
  • పూజారి కుడివైపునఉండి పూజాదికాలు నిర్వహిస్తుంటాడు. మనం ఎడమ వైపు నిలచి నమస్కరిస్తే భగవంతుని దర్శనం కనులకింపుగా కనపడుతుంది.

జై శ్రీమన్నారాయణ

  • అదే విష్ణు ఆలయాలు (అనగా రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి) దర్శించినపుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి, తరువాత మిగతావారిని దర్శించాలి. మొదట పాదములను చూసి, తరువాత ఆపాదమస్తకము దర్శించాలి.
  • ఆలయంలో దేవతా విగ్రహాలకు ఎలా నమస్కరించాలి?తోసుకుంటూ లేదా ముందువారిని అధిగమిస్తూ దర్శనం చేయరాదు.భగవంతుడ్ని కనులారా వీక్షించి ఆపై కనులు మూసుకొని ధ్యానం చేయాలి. చేతుల్ని మన హృదయానికి మధ్యలో కాకుండా కొద్దిగా పక్కకు పెట్టి నమస్కరించాలి.
  • అలా చేస్తే భగవంతునికి సూటిగా నమస్కరించినట్లు.లేకపోతే మనకు మనం నమస్కరించకున్నట్లుగా పరిగణించాలి.
  • భగవంతుని ముందు ఆశల పళ్లెం చేతపట్టుకొని యాచకుడుగా నిలబడకూడదు.భక్తుడిగా నిలబడాలి.ఎవరికి ఏమి దక్కలో వారికి అదే దక్కుతుంది.దైవం కనబడునదికాదు.ఫలితం మాత్రమే కనపడుతుంది.
  • గుడి పూజారికి కానుకులిచ్చి తీరాలన్న నియమం ఏమి లేదు.కాని నీదైవ సేవకునికి నీకు తోచినంత మనస్పూర్తిగా ధర్మం చేయుటలో తప్పేమి లేదు.
  • హారతి వల్ల ప్రయోజనం ఏమిటి? కర్పూరహారతి ఎలా కరిగిపోతుందో,అలాగనే మనం తెలిసీ తెలియక చేసిన తప్పులు సమసిపోవాలని  బగవంతుడ్ని వేడుకుంటూ హరతిని కళ్లకు హద్దుకోవటమే అసలు సిసలుయైన ఆధ్యాత్మిక అంతరార్ధం.
  • తీర్దం ఎలా తీసుకోవాలి?దేవాలయంలో నిల్చుని తీర్ధం పుచ్చుకోవాలి. తీర్ధం తాసుకోవటానికి చేతిని గోకర్ణ భంగిమలో ఉంచి తీసుకోవాలి.తీర్ధం తీసుకోవటంవల్ల చేయి ఎంగిలవుతుంది.ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు..తీర్ధం తీసుకున్న చేతిని సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి.
  • వైష్ణవ సంప్రదాయంలో గంగాజలంతో అభిషేకం చేసిన తీర్ధాన్ని మాత్రమే తల వెనుక రాసుకోవాలని ఉంది.తీర్దం సేవించేటప్పడు నేలపై పడకుండా జాగ్రత్త పడాలి.
  • గుడిలో దర్శనం అయ్యాక కూర్చొనేదెందుకు.?భగవంతుని దర్శనము,షడగోప్యము అయ్యాక ఒకింత సేపు కూర్చోని వెళ్లాలి. అలా కూర్చోమనేది ప్రశాంతతకోసం, పుణ్యంకోసం. కూర్చోకుండా వెళితే స్వామిని దర్శించిన ఫలం దక్కదు.
  • అలా కూర్చున్నప్పడు నంచి,చెడులు బేరీజు వేసుకుంటాం.ప్రశాంత మనసుతో ఆలోచిస్తాం. ఏది తప్పు,ఏది ఒప్పు అని ఆలోచనలో పడతాం.రోజువారి జీవన విధానాన్ని సరిచేసుకొని మంచి నార్గంలో నడుస్తాం.

Check Also

శ్రీ రామేశ్వర దేవాలయ చరిత్ర (పొనుగుపాడు)

చోళేశ్వరాలయం (పాత శివాలయం)  మనకు ఫొటోలో కనిపించే ఆలయంనకు పూర్వం ముందు ఈ ప్రదేశంలో చోళ రాజులు నిర్మించిన దేవాలయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *