జీవిత చరిత్ర
పొనుగుపాడు గ్రామంలో వెంకటేశ్వరరావు, భాగ్యలక్ష్మి దంపతులకు 05.07.1953న జన్మించారు. తండ్రి వెంకటేశ్వరావు 1960 నుండి 1964 వరకు గ్రామ పంచాయితి సర్పంచ్ గా పని చేసారు.
పెద్దబాబు ప్రాధమిక విద్య, ఉన్నతపాఠశాల విద్య స్వగ్రామం పొనుగుపాడులో 1958 నుండి 1968 వరకు గల మధ్యకాలంలో జరిగింది.
ఆ తరువాత గుంటూరు జె.కె.సి.లో పి.యు.సి.చదివారు.తదుపరి నరసరావుపేట యస్.యస్.యన్.కళాశాలలో 1970 నుండి 1973 వరకు గల మధ్య కాలంలో బి.ఎస్.సి. చదివి పట్టా పొందారు.
గుంటూరు ఎ.సి కళాశాల నందు 1974లో బి.యల్.కోర్సు నందు చేరి 1977లో న్యాయవాది పట్టా స్వీకరించారు.
న్యాయవాది పట్టా పొందిన ప్రధమ వ్యక్తి.
1977 అక్టోబరులో ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ హైదరాబాద్ నందు న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. వీరు 1977 నుండి 1980 వరకు ప్రకాశం జిల్లా, చీరాలలో ప్రముఖ న్యాయవాదిగా పేరొందిన కీ.శే.కర్లపూడి వెంకటేశ్వర్లు చౌదరి వద్ద జూనియర్ న్యాయవాదిగా పనిచేసారు.1980 నుండి 1985 వరకు గల మధ్య కాలంలో అదే జిల్లాలోని అద్దంకి కోర్టుల నందు స్వంతంగా ప్రాక్టీసు ప్రారంభించి న్యాయవాదిగా గుర్తింపు పొందారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టునందు న్యాయవాది వృత్తి చేపట్టాలనే ఉద్దేశ్యంతో అద్దంకి నుండి హైదరాబాదుకు మకాం మార్చారు.ఉన్నత న్యాయస్ధానంలో న్యాయవాది వృత్తికి అవసరమైన సాధనకోసం న్యాయమూర్తిగా వ్యవహరించిన జాస్తి ఈశ్వరప్రసాద్ గారి వద్ద జూనియర్ న్యాయవాదిగా ఒక సంవత్సరం పాటు పనిచేసారు. ఆ తరువాత స్వంతంగా తన కార్యాలయం ప్రారంభించారు.
అంతే గాదు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘంలో పాట్రన్ సభ్యుడు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు న్యాయవాదులు సంఘం, సిటీ క్రిమినల్ కోర్టుల న్యాయవాదులు సంఘం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కోర్టు న్యాయవాదుల సంఘం, మరియు యల్.బి.నగర్, హైదరాబాద్, ఎపిఎటి.సంఘంల నందు జీవితకాల సభ్యులు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ కు న్యాయవాదిగా 1987 నుండి 2004 వరకు వ్యవహరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరుపున ఎ.సి.బి. కేసులు విచారించుటకు స్టాండింగ్ కౌన్సిల్ కమ్ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటరుగా 1999 నుండి 2004 వరకు పని చేసారు.ఇంకా యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి, మరియు కెనరా బ్యాంకునకు న్యాయవాదిగా పనిచేసారు
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడుగా 1995 లో ఎంపికై 2000 వరకు పనిచేసారు . ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల అసోసియేషన్ అధ్యక్షుడిగా 1998 నుండి 1999 వరకు వ్యవహరించారు.
నేడు హైదరాబాదు నగరంలో ప్రముఖ న్యాయవాదిగా తగిన గుర్తింపు పొందారు. ఇప్పటికీ న్యాయవాదిగా పనిచేయుచున్నారు.గ్రామంలో ఎవ్వరికైనా హైకోర్టులో అవసరమైన పనులు ఉన్నయెడల వారు అక్కడకు వెళ్లనవసరం లేకుండానే పని చేసిపెట్టేవారు.
సేవా కార్యక్రమాలు
గ్రామంలో తూర్పు, ఉత్తరపు వైపు బజారుల నివాసులకు సరియైన హిందూ స్మశానవాటిక వసతి లేనందున తన స్వంత స్ధలం సర్వే.నెం.301ఎ లో య.00.50సెంట్లు భూమిని గ్రామ పంచాయతీకి 17.06.2006న రిజిష్టర్డ్ గిప్టుడీడ్ (1187/2006) ద్వారా దానం చేసారు.
ఆ స్మశానవాటికలో తన స్వంత నిధులతో లోగడ పాడుబడియున్న భావిని బాగు చేయించారు. అంతేగాదు దహనవాటిక ప్లాటుఫారం కట్టించి, ఐరన్ గేటు ఏర్పరచారు. అప్పటి యం.యల్.ఎ మాణిక్య వరప్రసాదుగారి ద్వారా యం.పి.ల్యాడ్స్ నిధులనుండి ఐదు లక్షల గ్రాంటుతో కొంతమేరకు ప్రహరీ గోడ నిర్మింపచేసారు.
జన్మించిన గ్రామం మీద అభిమానంతో గ్రామంలో జీర్ణోద్ధరణ జరుగుచున్న శ్రీఆంజనేయ స్వామి దేవాలయం, శ్రీరామాలయం, శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలకు మరియు నూతనంగా నిర్మించుచున్న శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంనకు ఒక్కొక్కదానికి లక్ష రుపాయలు చొప్పన ఆర్ధికంగా విరాళం అందించారు.శ్రీకాశీవిశ్వేశ్వరస్వామి ఆలయం 100వ కళ్యాణం మహోత్సవంనకు రు.10000/-లు స్వామివార్కి సమర్పించారు.
ఇంకా హరిజనవాడలో నిర్మించిన లూథరన్ చర్చి భవనంనకు లక్ష రుపాయలు ఆర్ధిక సహాయం చేసారు. గ్రామ దేవతగా ప్రసిద్ధి పొందిన వినుకొండ అంకమ్మ తల్లి ఆలయ జీర్ణోద్ధరణకు పదివేల రుపాయలు ఆర్ధిక సహాయం చేసారు. గ్రామ పంచాయితీ కార్యాలయంనకు 2013లో కంప్యూటరు, ప్రింటరు తన స్వంత నిధులతో సమకూర్చారు.
జగమంత కుటుంబం

వెంకటేశ్వరరావు,భాగ్యలక్ష్మి దంపతుల సంతానం ముగ్గురు కుమార్తెలు.అరుణకుమారి, సరళ, పంకజ. వీరి తరువాత ప్రధమ కుమార్డుగా పెద్దబాబు, ద్వితీయ కుమార్డుగా తిరుపతిరావు (బుల్లిబాబు) జన్మించారు,
పెద్దబాబు ప్రకాశం జిల్లా, తిమ్మసముద్రం గ్రామానికి చెందిన బత్తుల సత్యనారాయణ,(అడ్వకేటు-ఒంగోలు) వెంకాయమ్మ దంపతుల కుమార్తె రత్నకుమారిని 1978 లో వివాహమాడారు.
వృత్తిరీత్యా హైదరాబాదులో ఉంటున్నప్పటికి పొనుగుపాడులో జరిగే ప్రతి కార్యక్రమానికి కుటుంబంతో తప్పనిసరిగా వచ్చి గ్రామ ప్రజలతో మమేకం అవుతారు.ఇది చాలా అభినందించతగ్గ విషయం.
అంతేగాదు హైదరాబాదులో నివశించే పొనుగుపాడు గ్రామానికి చెందినవారు ఎటువంటి చిన్న శుభకార్యం జరుపుకున్ననూ వీరిని తప్పనిసరిగా ఆహ్వానిస్తారు. ఎన్ని పనులున్ననూ కార్యక్రమానికి కుటుంబంతో వచ్చి దీవెనలు అందచేస్తారు.
పెద్దబాబు, రత్నకుమారి దంపతుల సంతానం ఒక కుమార్తె,ఇద్దరు కుమారులు.

కుమార్తె స్వప్న యం.యస్. (ఇంజనీరింగ్) చేసింది. స్వప్న వివాహం పెద్దబాబు తృతీయ అక్క (పంకజ, వెంకట సుబ్బారావు దంపతుల) కుమారుడు గోపి కళ్యాణ చక్రవర్తి, యం.యస్. (ఇంజనీరింగ్) తో జరిగింది. కుమార్తె,అల్లుడు ఇద్దరూ ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్నారు. వీరి సంతానం తన్వి, ప్రణవి.
పెద్ద కుమారుడు రామచంద్రరావు (పెద్దబాబు గారి తాత పేరు) బి.ఎ, (ఆనర్స్) బి.యల్. మరియు యల్.యల్.యమ్.చేసి హైకోర్టు అడ్వకేటుగా ప్రాక్టీసు చేయుచున్నారు. రామచంద్రరావు వివాహం తుమ్మల జగదీష్ పద్మ దంపతుల కుమార్తె అజితను 2009 లో వివాహమాడారు. వీరి సంతానం ఒక కుమార్డు జగదీష్.
ఇక రెండవ కుమార్డు వెంకటేశ్వరరావు (పెద్దబాబుగారి తండ్రి పేరు) యం.యస్.(ఇంజనీరింగ్) చేసారు. వెంకటేశ్వరరావు వివాహం గుంటూరుకు చెందిన రావుల సుబ్బారావు, వాణి దంపతుల కుమార్తె అనూష యం.యస్.(ఇంజనీరింగ్) తో జరిగింది. ఉద్యోగరీత్యా దంపతులు ఇద్దరు అమెరికాలో ఉంటున్నారు. వీరి సంతానం ఒక కుమార్తె. పేరు రిథి.